వంద ఎలుకలు తిన్న రాబందు తీర్థయాత్రలకు పోయినట్లు, దయ్యాలు వేదాలు వల్లించినట్లు రేవంత్ రెడ్డి వైఖరి ఉందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఒక్కనాడు జై తెలంగాణ అనలేదు, అమరవీరులకు పువ్వు పెట్టింది లేదు.
ఉద్యమంలో ఏనాడూ పాల్గొన్న వ్యక్తి కాదన్నారు. డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితం. ఎవరో దయ వల్ల తెలంగాణ వచ్చింది అనడం ఉద్యమ కారులను, తెలంగాణ వారిని అవమానించడమే అన్నారు. తెలంగాణకు అడుగడుగునా అడ్డు పడ్డది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ది ద్రోహాల చరిత్ర అని ఆనాడు ఆంధ్ర లాబియింగ్ కు తలొగ్గి ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ ఫజల్ అలీ కమిషన్ సఫిర్సులను తుంగలో తొక్కింది నెహ్రూ అన్నారు.
1969 ఉద్యమాన్ని ఇనుప కాళ్లతో తొక్కింది ఇందిరమ్మ రాజ్యం. కాంగ్రెస్ పొట్టన బెట్టుకున్న అమరులకు నిదర్శనం అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం. 369 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ, అమాయకులను బలి తీసుకున్నది. తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్ లో కలుపుకొని ప్రజల ఆకాంక్షను కాలరాశారు. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టకుంటే, పోరాటం చేయకుంటే అసలు తెలంగాణ మాటే లేదు. అసెంబ్లీలో నాటి పాలకులు తెలంగాణ పదం నిషేధించారని గుర్తు చేశారు. తెలంగాణ బదులు వెనుకబడ్డ ప్రాంతం అనాలని హుకుం జారీ చేశారన్నారు.
66 ఏండ్ల టీడీపీ, కాంగ్రెస్ పాలనలో జై తెలంగాణ అంటే పాపం. అలాంటి సమయంలో కేసీఆర్ పార్టీ పెట్టారు, ఉద్యమాన్ని ముందుండి నిడిపించారు. 2004లో హామి ఇస్తే కేంద్ర క్యాబినెట్ లో చేరారు. తెలంగాణ ఇవ్వక పోగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రయత్నం చేశారు. ఉద్యమాన్ని కాలరాసే ప్రయత్నం చేశారు. కేంద్రంలో మంత్రిగా ఉండి ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్ యూ ఆఫీసు దాకా తిరిగిండు. దేశంలో 32 రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇచ్చింది కేసీఆరేనన్నారు. ఇది చరిత్రలో ఉన్న వాస్తవం. ఆ సమయంలో ఇక్కడ వైయస్ తెలంగాణ ఇవ్వడానికి సిగరెట్టా, బీడా అన్నరు.
హైదరాబాద్ పోవాలంటే పాస్ పోర్టు వీసా కావాలె అన్నరు. అయినా కేసీఆర్ తెలంగాణ కోసం నిరంతరం శ్రమించారు.
అయినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వలేదు. చివరకు కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామ చేసి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ విద్యార్థుల ఆత్మబలిదానాలకు కారణం కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చి ఉంటే అంతమంది చనిపోయేవారా? అని ప్రశ్నించారు. అయితే నా శవ యాత్ర, లేదంటే జైత్ర యాత్ర అని, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని కేసీఆర్ ఉద్యమానికి కూర్చొంటే ఖమ్మం తరలించారు. ఖమ్మం జైల్లో పెట్టి ఉద్యమాన్ని అణిచివేసే కుట్ర చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? డిసెంబర్ 9 ప్రకటన కేసీఆర్ పోరాట ఫలితం కాదా? చిదంబరం జయశంకర్ గారికి ఫోన్ చేశారు. జయశంకర్, కేసీఆర్ రాసి ఇచ్చిందే చిదంబరం చదివారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అయిందని ప్రకటించారు. నవంబర్ 29 లేకుంటే, డిసెంబర్ 9 లేదు, ఇవి లేకుంటే జూన్ 2 తెలంగాణ ఏర్పాటు లేదు. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయలేదని ఆవేదనతో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.చంద్రబాబును ఎవరు నిలదీస్తున్నరు అని రైఫిల్ పట్టుకొని ఉద్యమ కారుల మీదికి వెళ్లింది ఈ రైఫిల్ రెడ్డి అని విమర్శించారు. 2004లో తెలంగాణ ఇచ్చి ఉంటే ఒక్క బిడ్డ ప్రాణం పోయి ఉండేది కాదు. 15 ఏండ్ల క్రింద చిదంబరం ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ దీక్షాఫలం కేసీఆర్, స్వహస్తాలతో రాసిన ప్రకటన అది. సోనియా గాంధీ దయతలచి ఇచ్చిందని అంటున్నారు. దయతలచి కాదు, పోరాటం చేస్తే తప్పని పరిస్థితిలో తెలంగాణ ఇచ్చింది. నెహ్రూ, గాంధీ గారు పోరాటం చేయలేదు, బ్రిటీష్ వాళ్లే దయతలచి దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినట్లు ఉంది. రాజీనామాలకు వెన్ను చూపి పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిది.
వంట వార్పులో, రైలు రోకోలో, మిలియన్ మార్చులో, సకల జనుల సమ్మెలో, సాగర హారంలో రేవంత్ రెడ్డి లేడు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఉద్యమం గురించి. నీ ద్రోహ చరిత్ర, రెండు కళ్ల సిద్దాంతం సేవలో ఉన్నవు. తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. మా మీద 350 కేసులు ఉండే ఆరోజు. అరెస్టు అయి జైళ్లలో ఉన్నాం. రేవంత్ రెడ్డి మీద ఒక్క కేసు అయినా ఉన్నదా? నాడు సోనియా బలి దేవత అన్నడు, నేడు దేవత అంటున్నడు. నాడు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసాడు, వెన్నుపోటు పొడిచాడు.
వక్రీకరించిన మాత్రాన తెలంగాణ చరిత్ర చెరిగిపోదు. కేసీఆర్ గారి కీర్తి ఎన్నటికీ పోదు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడా పెట్టలేదని రేవంత్ మాట్లాడటం సిగ్గుచేటు. అవగాహనరాహిత్యం. సంగారెడ్డి కలెక్టరేట్ లోనే జూన్ 2, 2015 నాడు నేను, ఎమ్మెల్యే, కలెక్టర్ రాహుల్ బొజ్జా కలిసి విగ్రహం ఆవిష్కరించాం. అమరుల స్తూపం కూడా ఆవిష్కరించాం. సచివాలయం ముందు అమరుల స్తూపం ముందు తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. భారత మాతను ఏ పార్టీ మార్చలేదు. మార్పు మార్పు అని ఏం చేశావు.. కేసీఆర్ కిట్ బంధు, న్యూట్రీషన్ కిట్టు బంధు, దళిత, బీసీ, రైతు బంధు బంద్ పెట్టినవు. గురుకులాల్లో 49 మంది విద్యార్థులు చనిపోవడం నువ్వు తెచ్చిన మార్పు. టీజీ చేయడం, తెలంగాణ తల్లిని మార్చడం కాదు.. తెలంగాణ ద్రోహ చరిత్ర నీది రేవంత్ రెడ్డి అని విమర్శించారు.






