రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు లభించాలంటే పరిశ్రమలు స్థాపించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అవసరమైన చోట భూ సేకరణ జరగాల్సిందేనని అయితే, భూమి రైతుల ఆత్మగౌరవంతో ముడివడి ఉంటుందని చెప్పారు. భూ సేకరణ చట్టం ప్రకారం తగిన పరిహారం ఇవ్వలేని పరిస్థితి ఉన్నందున, భూ సేకరణ చేసే ప్రాంతాల్లో భూముల విలువ మూడింతలు పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి, కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గుడి చెరువు మైదానంలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
నేతన్నలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యార్న్ డిపోను ఈ వేదిక నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. సీఎం సభను ఉద్దేశించి మాట్లాడుతూ… భూ సేకరణలో భూములు కోల్పోయే రైతుల బాధలను ప్రజా ప్రభుత్వం అర్థం చేసుకోగలదు. శాశ్వత అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియలో త్యాగం చేస్తున్న భూ యజమాన కుటుంబాలను ఆదుకోవడానికి నష్టపరిహారం పెంచాలి. అప్పుడే రైతులు ముందుకొస్తారు. అందుకే నష్టపరిహారానికి సంబంధించిన చట్టాన్ని సవరించాలని ఆదేశాలిచ్చామని చెప్పారు. పది సంవత్సరాల ఈ తెలంగాణను ఒక గొప్ప అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం. మీ ప్రాంత అభివృద్ధి మా బాధ్యత అని ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా తెలంగాణను చూసి కాపీ కొట్టాల్సిందే. తెలంగాణను చూడటానికి రాష్ట్రానికి రావాల్సిందే. ఆ విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళదామన్నారు.
రాజన్న సిరిసిల్లా జిల్లా అభివృద్ధికి నిధులిచ్చాం. గత ప్రభుత్వ హయాంలో వేములవాడ ఆలయ అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైంది. గత పదేళ్లు చేయలేని పనులను ప్రజా ప్రభుత్వం పది నెలల్లో చేసి చూపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో నవంబర్ 30 లోగా జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమీక్ష చేస్తారని తెలిపారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదవశాత్తు మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం. కేవలం పది నెలల్లో రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఈ విషయంలో చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఏ రాష్ట్రంలోనూ ఇవ్వలేదు. కాళేశ్వరం నుంచి చుక్కనీరు పారకున్నా రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ప్రతి గింజా కొనుగోలు చేయడమే కాకుండా సన్న రకానికి రూ.500 బోనస్ కూడా చెల్లిస్తున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, దామోదర రాజనర్సింహ గారు, తుమ్మల నాగేశ్వర రావు గారు, కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ గారితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.








